దుబ్బాకలో ఏమ్ జరుగుతోంది? అధికారుల తప్పిదాలతో 600 కుటుంబాల భవితవ్యం నిషేధిత జాబితాలో
దుబ్బాకలో ఏమ్ జరుగుతోంది? అధికారుల తప్పిదాలతో 600 కుటుంబాల భవితవ్యం నిషేధిత జాబితాలో
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి
రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో అధికారుల పొరపాట్లు సామాన్య ప్రజలకు శాపంగా మారాయి. సొంత స్థలాల్లో, ప్రభుత్వ పట్టాలతో నిర్మించుకున్న ఇళ్లు ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో వందల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. సమస్యను సరిదిద్దుతామని అధికారులు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుబ్బాక గ్రామంలో 600కు పైగా నివాస గృహాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానంలో భాగంగా రెండు నెలల క్రితం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో జరిగిన పొరపాట్ల కారణంగా, 1998లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన సుందరయ్య కాలనీలోని 225 సర్వే నంబర్తో పాటు 3, 394, 395 సర్వే నంబర్లలోని పట్టాభూములు కూడా నిషేధిత జాబితాలో చేర్చబడ్డాయి. దీంతో 247 కుటుంబాలతో పాటు మొత్తం 600కు పైగా కుటుంబాలు ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి.
నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ఆస్తులు కొనుగోలు చేయలేక, విక్రయించలేక బాధితులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకు రుణాలు రాకపోవడం, కనీసం ష్యూరిటీకి కూడా ఆస్తులు పనికిరాకపోవడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. మూడు–నాలుగు తరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చడమేంటని రెవెన్యూ, పంచాయతీ అధికారులను గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
తప్పును వెంటనే సరిదిద్దాలని పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి