ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు
Krishna
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు, మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా వాహనాలు, సంచులు లేకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అమ్మిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు చేయాలని, వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా తాటిపత్రి సౌకర్యం కల్పించాలని, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో భారీగా జొన్న సాగు జరిగినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి