ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతుల ఆందోళన వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన
Editor Desk
యాదగిరిగుట్ట: వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో రైతులు మంగళవారం నిరసన చేపట్టారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు.
గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో పాటు తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.
కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం దండగలా మారిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోజువారీగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పాపట్ల నరహరి, గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం, రైతులు కర్రె చంద్రశేఖర్, ఒగ్గు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి