దేశంలో కుల వివక్ష లేని సమాజం నిర్మించాలి. ‘ఇండియా @ 80’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి: బెజవాడ విల్సన్
దేశంలో కుల వివక్ష లేని సమాజం నిర్మించాలి. ‘ఇండియా @ 80’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి: బెజవాడ విల్సన్
Editor Desk
హైదరాబాద్,
దేశంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగడం బాధాకరమని రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి బెజవాడ విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో “పూర్వ విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రసంగం” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ సఫాయి కర్మచారి వ్యవస్థ కొనసాగుతోందన్నారు. ఈ వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన “ఇండియా @ 80” ఉద్యమానికి విద్యావంతులు, మేధావులు మద్దతు ఇవ్వాలని కోరారు. అణగారిన వర్గాల విద్యార్థుల సామాజిక, మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని అధ్యాపకులు విద్యాబోధన చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలు కొంత మేర మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ, ప్రైవేట్ విద్య ధనికులకు మాత్రమే పరిమితమవుతోందన్నారు. విద్య సమానత్వ భావనను పెంపొందించేలా ఉండాలని, ఆ దిశగా విద్యాసంస్థలు పనిచేయాలని పిలుపునిచ్చారు. తనలాంటి లక్షలాది మందికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ జీవితానికి దారి చూపిందని పేర్కొన్నారు. దేశంలో ఇంకా పితృస్వామ్య వ్యవస్థ కొనసాగుతోందని, దీనిపై విస్తృత చర్చ జరగాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సఫాయి కర్మచారి వ్యవస్థ నిర్మూలన కోసం బెజవాడ విల్సన్ చేసిన పోరాటం ఆదర్శప్రాయమన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి మానవతా విలువల కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు.
కార్యక్రమానికి రిజిస్ట్రార్ డా. విజయకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. పల్లవి కబ్డే, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. పి. వెంకటరమణ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డా. సాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి