దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం
Biksham
కేంద్ర ప్రభుత్వంపై కుట్ర ఆరోపణలు – హక్కులు కల్పించాలని డిమాండ్
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ క్రైస్తవ సేవా సమితి ఆధ్వర్యంలో వైఎంసీఏ ప్రాంగణంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల్ల కిషోర్ బాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్, సీనియర్ న్యాయవాది కదిరె కృష్ణ, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అన్ని మతాల్లో వివక్ష కొనసాగుతున్నప్పటికీ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. మతం మారినప్పటికీ అణచివేత తగ్గలేదని అన్నారు.
రావెల్ల కిషోర్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నప్పటికీ దళిత క్రైస్తవ సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. డాక్టర్ అంబేద్కర్ కల్పించిన హక్కులు దళిత క్రైస్తవులకు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ఇప్పటికీ అంటరానితనం, వివక్షకు గురవుతున్నారని తెలిపారు. చాలా మంది తమను దళిత క్రైస్తవులుగా ప్రకటించుకునే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో క్రైస్తవ సేవా సమితి అధ్యక్షుడు ఎం సల్మాన్ రాజు, శంకర్ లూక్, లియో లూయిస్, ఎన్పి రాజు, మోజెస్, సీనియర్ పాస్టర్ జాన్సన్ డేవిడ్, పాస్టర్ నవీన్ చిట్ట, జవహర్ కెన్నడీ, సుధీర్, నారపల్లి రాజేష్, విశ్రాంత న్యాయమూర్తులు జయసూర్య, రాజ్ కుమార్, మేజర్ విజయ్ కుమార్, కెప్టెన్ సునీల్, నాయుడు, బిషప్ దుర్గం ప్రభాకర్, బ్రదర్ ఇరుగు సంసన్, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు.పలు సంఘాల నాయకులు, పాస్టర్లు, బిషప్లు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి