Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:52 AM

డబ్బు, మద్యం ఓడిపోయాయి.. ప్రజాసేవ గెలిచింది! మునిపంపుల తీర్పు ఆదర్శం.

డబ్బు, మద్యం ఓడిపోయాయి.. ప్రజాసేవ గెలిచింది! మునిపంపుల తీర్పు ఆదర్శం.

డబ్బు, మద్యం ఓడిపోయాయి.. ప్రజాసేవ గెలిచింది! మునిపంపుల తీర్పు ఆదర్శం.
December 18, 2025 11:57 PM 148 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
ప్రలోభాలకు చెంపపెట్టు.. సామాన్యుడికి పట్టం: మునిపంపుల సర్పంచ్‌గా బొడ్డుపల్లి వెంకటేశం.
కొత్త చరిత్ర: రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్ గెలుపు.. యువత, ప్రజల ఐక్యతకు నిదర్శనం.
ఎన్నికలంటేనే డబ్బు, మద్యం, కులం, మతం అనేవి ప్రధాన పాత్ర పోషించే ఈ రోజుల్లో.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం 'మునిపంపుల' గ్రామ ప్రజలు మాత్రం ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రలోభాలకు లొంగకుండా, నిస్వార్థంగా సేవ చేసే నాయకుడికే పట్టం కట్టి ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారు.
సేవకు దక్కిన గుర్తింపు సిపిఎం (CPM) మండల కార్యదర్శిగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే బొడ్డుపల్లి వెంకటేశంను గ్రామస్థులు ఏకతాటిపై నిలిచి సర్పంచ్‌గా గెలిపించుకున్నారు. గత కొంతకాలంగా గ్రామంలో రక్తదాన శిబిరాలు, క్రీడా పోటీలు, యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వెంకటేశం ప్రజలకు చేరువయ్యారు. ఇటీవల దేవిరెడ్డి నర్సిరెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 2 వేల మందికి పరీక్షలు, ఆపరేషన్లు చేయించడంలో ఆయన చూపిన చొరవ ప్రజల మనసు గెలుచుకుంది.
రూపాయి పంచలేదు.. ప్రజలే విరాళాలిచ్చారు! సాధారణంగా ఎన్నికల్లో పోటీ అంటే లక్షల ఖర్చుతో కూడుకున్న పని. కానీ, వెంకటేశం విషయంలో ఇది తలకిందులైంది. "నువ్వు పోటీ చేయ్.. ఖర్చు మేం భరిస్తాం" అంటూ గ్రామ ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. వెంకటేశం తన జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.

యువత కదిలింది.. చరిత్ర సృష్టించింది వెంకటేశం గెలుపు కోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసే యువత పది రోజుల పాటు సెలవు పెట్టి గ్రామానికి వచ్చారు. తాము కష్టపడి సంపాదించిన నెల జీతాలను ఎన్నికల ఖర్చు కోసం విరాళంగా ఇచ్చి, విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే 450 ఓట్ల మెజారిటీని కట్టబెట్టి వెంకటేశంను గెలిపించారు. గ్రామంలోని బీఆర్ఎస్ (BRS) శ్రేణులు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: బొడ్డుపల్లి వెంకటేశం తన గెలుపుపై నూతన సర్పంచ్ వెంకటేశం స్పందిస్తూ.. "గ్రామ ప్రజలు, యువత, అన్ని వర్గాల నాయకులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. రాజకీయాలకు అతీతంగా, అందరి సహకారంతో మునిపంపులను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రధమ కర్తవ్యం" అని పేర్కొన్నారు.
స్వచ్ఛమైన రాజకీయాలకు, చైతన్యానికి నిలువుటద్దంగా నిలిచిన మునిపంపుల గ్రామ ప్రజల తీర్పును ఇప్పుడు జిల్లా అంతా ఆసక్తిగా చర్చించుకుంటోంది.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News