చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..
చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అపూర్వ చైతన్యాన్ని ప్రదర్శించారు.పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 91.91 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం.ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించగా, సాయంత్రం వరకు అదే ఉత్సాహం కొనసాగింది. చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని 20 వార్డుల్లో మొత్తం 25,801 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12,963 మంది మహిళలు,12,838 మంది పురుష ఓటర్లు ఉండగా.. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 11,931 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 11,782 మంది పురుషులు ఓటేశారు. శాతాలవారీగా చూసిన మహిళల పోలింగ్ అధికంగా నమోదవడం గమనార్వం.
కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూలైన్లు కనిపించినా..
ప్రజాస్వామ్యం పట్ల మహిళల నిబద్ధత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పలు కేంద్రాలలో మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పోలింగ్ సజావుగా సాగింది.యువతతో పాటు వృద్ధులు కూడా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూ లైన్ లు కనిపించినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగింది. ఇంత భారీ శాతంలో పోలింగ్ నమోదవడం అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటరు తీర్పు ఎటు మొగ్గు చూపిస్తుందో ఆన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది. చౌటుప్పల్ లో నమోదైన ఈ రికార్డు స్థాయి పోలింగ్ ప్రజాస్వామ్యానికి ప్రజలు ఇచ్చిన గొప్ప మద్దతుగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి