చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ లో భారీ చేరికలు
చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ లో భారీ చేరికలు
Komidala Mahender reddy
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో కాంగ్రెస్ నేత నిమ్మనగోటి శ్రీను బిఆర్ఎస్ లో చేరిక
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో కాంగ్రెస్ నేత నిమ్మనగోటి శ్రీను బీఆర్ఎస్లో చేరిక
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిమ్మనగోటి శ్రీను, యువశక్తి యూత్కు చెందిన సుమారు వంద మంది యువకులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య నూతనంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసే ప్రజలు మరోసారి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అమలుకాని హామీలు, మోసపూరిత గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. రెండేళ్ల కాలంలో ఒక్క పైసా పని చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలోనే చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని పేర్కొన్న చిరుమర్తి లింగయ్య, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపాలిటీలో రూ.40 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను బెదిరిస్తున్నారని, యువతకు రాజకీయంగా పెద్దపీట వేసింది నాడైనా నేడైనా బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, మరో రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అక్రమ కేసుల పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో సిట్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్కు నోటీసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదని వ్యాఖ్యానించారు. డైవర్షన్, అటెన్షన్ పాలిటిక్స్తో కాంగ్రెస్ మంత్రులు కాలయాపన చేస్తున్నారని, ఇది ప్రజాపాలన కాదని కక్షసాధింపు పాలనగా అభివర్ణించారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజన్తో తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ పాలనపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
చిట్యాల మున్సిపాలిటీలో ప్రతి ఓటరు బీఆర్ఎస్ పార్టీపై సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారని, అన్ని వార్డుల్లో బంపర్ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బహుమతిగా పంపుదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఎన్నికల ఇంచార్జి చాడ కిషన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి