Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:41 PM

చిన్న పత్రికలకు న్యాయం చేయాలి – సమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల గర్జన

చిన్న పత్రికలకు న్యాయం చేయాలి – సమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల గర్జన

చిన్న పత్రికలకు న్యాయం చేయాలి – సమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల గర్జన
February 17, 2026 11:11 PM 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆర్ఎన్ఐ, పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా, ఎంప్యానల్‌మెంట్ ప్రక్రియలో పక్కనబెట్టి వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం అయిన సమాచార భవన్ ఎదుట పాత్రికేయులు భారీ ఆందోళన చేపట్టారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి చిన్న, మధ్య తరహా పత్రికల నిర్వాహకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ర్యాలీగా సమాచార భవన్‌కు చేరుకున్న వారు కార్యాలయం ప్రవేశ ద్వారం ఎదుట బైఠాయించి దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది.ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్న, మధ్య తరహా పత్రికల అణచివేత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 44 వేలకుపైగా అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఎంప్యానల్ అయిన కొద్ది పత్రికలు, చానళ్లకే పరిమితం చేస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న ప్రతి పత్రికకు, సర్క్యులేషన్ ఆధారంగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేవారని గుర్తుచేశారు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఎంప్యానల్ నిబంధనల పేరుతో చిన్న, మధ్య తరహా పత్రికలను పక్కనబెట్టి అణగదొక్కుతున్నారని ధ్వజమెత్తారు. స్వరాష్ట్రంలోనే చిన్న పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారడం దురదృష్టకరమని అన్నారు.అధికారంలోకి రావడానికి ముందు జర్నలిస్టుల తరఫున గొంతెత్తిన నాయకులు, అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లు గడిచినా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. ఆర్ఎన్ఐ, పీఆర్‌జీఐ గుర్తింపు ఉన్న పత్రికలను ఎంప్యానల్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. మరోవైపు ఇప్పటికే ఎంప్యానల్ జాబితాలో ఉన్న పత్రికలను కూడా తొలగించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వ వివక్ష కారణంగా చిన్న పత్రికల నిర్వహణ భారంగా మారి, అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే పునరాలోచన చేసి ఆర్ఎన్ఐ, పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి పత్రికకు గతంలో మాదిరిగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా ప్రతి పత్రికకు నెలకు కనీసం ఒక ప్రకటన ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్ స్థాపనకు ఒక ఎకరం భూమిని ప్రభుత్వ నామమాత్ర ధరకు కేటాయించి రుణ సదుపాయం కల్పించాలని కోరారు.అదేవిధంగా అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత బస్ పాస్, ఆరోగ్య కార్డులు, భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు మరియు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం సమాచార శాఖ సంయుక్త సంచాలకుడు జగన్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.చిన్న, మధ్య తరహా పత్రికలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని జర్నలిస్టులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News