Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:06 AM

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆలయ ఈవో మోహన్ బాబు

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆలయ ఈవో మోహన్ బాబు

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆలయ ఈవో మోహన్ బాబు
January 22, 2026 01:32 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నమ్మిన భక్తులకు కొంగుబంగారమై విరాజిల్లుతున్న దేవస్థానాల్లో తెలంగాణ రెండో శ్రీశైలంగా పేరొందిన చెర్వుగట్టు దేవస్థానం మరోసారి భక్తుల జయజయధ్వానాలతో మార్మోగనుంది. కొలిచిన భక్తులకు చల్లని చూపులు చూపే దేవుడిగా ప్రసిద్ధి చెందిన చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కొలువు తీరిన ఈ ఆలయం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఉంది.

ఈ ఆలయ కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని, మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార విశ్వాసం. అలాంటి మహిమాన్విత దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి అన్ని శాఖల అధికారులతో వారం రోజుల క్రితమే సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ గుట్టపై అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఘట్టం స్వామివారి కళ్యాణం. అనంతరం జరిగే ‘ఓడి బియ్యం పోయడం’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కళ్యాణ మండపం పరిసరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో మోహన్ బాబు తెలిపారు.

శనివారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండాలు, సోమవారం తెల్లవారుజామున అశ్వవాహన సేవ, రాత్రిపూట ఏకాంత సేవలు నిర్వహించనున్నారు. అనంతరం 31వ తేదీ బుధవారం సాయంత్రం స్వామివారి విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించి జాతరను ముగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

స్వామివారి కళ్యాణం సందర్భంగా వేలాది మంది భక్తులు తమ మొక్కులు చెల్లించేందుకు వడి బియ్యం, తలంబ్రాలు సమర్పిస్తుండటంతో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఆలయ సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టనున్నారు. విద్యుత్ లైట్లు, మైక్ సిస్టమ్స్, గర్భగుడి ఫైటింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

జడల రామలింగేశ్వర స్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పేరుగాంచడంతో తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు.

సాక్షి – ఈనాడు ఎఫెక్ట్‌తో చెర్వుగట్టు జాతర ఈసారి మరింత వైభవంగా సాగనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News