చౌటుప్పల్ చెక్పోస్టులో పశువుల లారీ పట్టివేత
చౌటుప్పల్ చెక్పోస్టులో పశువుల లారీ పట్టివేత
K.RAVI
అనుమతులు లేకుండా తరలిస్తున్న 25 పశువులు స్వాధీనం
ఖమ్మం నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తుండగా గుర్తించిన పోలీసులు
లారీ సీజ్.. డ్రైవర్పై కేసు నమోదు
చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ప్లాజా చెక్పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల లారీ పట్టుబడింది. లారీలో ఇరుకుగా తరలిస్తున్న 25 పశువులను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ ఎస్హెచ్వో జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఎ. నరేష్, ఏఆర్పీసీ సీతారాం రెడ్డి పెట్రోమొబైల్-01 వాహనంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వచ్చిన సమాచారం మేరకు పంతంగి చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ లారీ (TS 7UE 3009)ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా 9 ఆవులు, 16 ఎద్దులు కలిపి మొత్తం 25 పశువులను ఇరుకుగా తరలిస్తున్నట్లు గుర్తించారు.లారీ డ్రైవర్ ఎండి షఫీ (50), సరూర్నగర్ పరిధిలోని జలపల్లి వాసిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా పనితాపురం సంత నుంచి పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. లారీ యజమాని ఎండి పాషా అని డ్రైవర్ వెల్లడించినట్లు తెలిపారు.
పశువులను, లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్హెచ్వో జి. మన్మధ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి