చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు
చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు
K.RAVI
ఎన్నికల అధికారులు అమ్ముడుపోయారని ఫిర్యాదు – బార్ కౌన్సిల్కు న్యాయవాదుల విజ్ఞప్తి
చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు తెలంగాణ బార్ కౌన్సిల్ను ఆశ్రయించారు. ఈ నెల 26న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల అధికారులు కానుగుల వెంకటయ్య, సిహెచ్ రాధా కిషన్ రావులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వాకిటి నరసింహారెడ్డి, పాల పరమేష్, ఏ. రంగారెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల అధికారులు రెండు బ్యాలెట్ బుక్కులను ముద్రించి, వాటిపై సంతకాలు చేసి, ఒక వర్గానికి అనుకూలంగా సహకరించారని ఆరోపించారు. ఒక న్యాయవాది వద్ద డమ్మీ బ్యాలెట్ పేపర్ లభించడంతో, అందులో స్వస్తిక్ గుర్తు ఉండటం అనుమానాలకు దారితీసిందన్నారు.తాము వెంటనే ఎన్నికల అధికారులకు విషయాన్ని తెలియజేసి, రెండు అధికారుల సంతకాలు ఉండేలా చూడాలని, బయట నుంచి వచ్చే బ్యాలెట్ పేపర్లను అడ్డుకోవాలని సూచించినప్పటికీ వారు పట్టించుకోలేదని వాపోయారు. ఓటింగ్ సమయంలో ఒక ఓటరు సెల్ఫోన్తో వీడియో కాల్లో ఉండటం గమనించి, ఫోన్ను అధికారులకు అందించినా, దాన్ని సీజ్ చేయకుండా తిరిగి ఇచ్చినట్టు తెలిపారు.ఓట్ల లెక్కింపులో కూడా స్వస్తిక్ గుర్తులు వేరువేరుగా ఉండటం, ఇంకు తేడాలు కనిపించడం, బ్యాలెట్ పేపర్లు ముడతలు పడటం వంటి అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలపై తాము రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ గుర్తులు, ఇంకు ప్యాడ్లను సీజ్ చేయాలని కోరినా చర్యలు తీసుకోలేదని, దీంతో ఎన్నికల అధికారులు అమ్ముడుపోయినట్టు స్పష్టమవుతోందని వారు అన్నారు.ఈ నేపథ్యంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, సంబంధిత ఎన్నికల అధికారులపై విచారణ జరిపి బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ను న్యాయవాదులు డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి