చాట్రాయిలో తహసిల్దార్ లేక కార్యాలయం వెలవెల… ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులు
చాట్రాయిలో తహసిల్దార్ లేక కార్యాలయం వెలవెల… ప్రజలకు పెరుగుతున్న ఇబ్బందులు
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా చాట్రాయి మండల తహసిల్దార్ కార్యాలయం ఒకప్పుడు నిత్యం ప్రజల రద్దీతో కళకళలాడుతుండగా, ప్రస్తుతం వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు పది నెలలుగా రెగ్యులర్ తహసిల్దార్ లేక ఇన్చార్జ్తోనే కార్యాలయం కొనసాగుతుండటంతో ప్రజలకు అవసరమైన పనులు జరగక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కార్యాలయానికి వచ్చిన ప్రజలను పట్టించుకునే అధికారి లేకపోవడంతో అనేక మంది పనులు కాక వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో అత్యంత కీలకమైన తహసిల్దార్ పదవి ఖాళీగా ఉండటం, అది కూడా మంత్రి స్వంత నియోజకవర్గ పరిధిలోనే ఉన్న ప్రాంతంలో ఇన్చార్జ్తో కొనసాగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్ తహసిల్దార్ లేకపోవడంతో రెవెన్యూ కార్యదర్శులు అమ్యామ్యాలు అధికంగా అడుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పాసుపుస్తకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత కార్యదర్శిని వ్యక్తిగతంగా కలవకపోతే వివిధ కారణాలు చూపుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. కార్యాలయంలో పర్యవేక్షణ లేకపోవడంతో లంచాల వ్యవహారం పెరిగిందని ప్రజలు అంటున్నారు. తహసిల్దార్ కార్యాలయానికి వెళితే కనీసం పలకరించే వ్యక్తి కూడా లేకపోవడం గమనార్హం, ఎప్పుడు చూసిన ఖాళీ కుర్చీలతో దర్శనం ఏమిటంటే ఫీల్డ్ కి వెళ్లారు ఇదే సమాధానం ఈ పరిస్థితి కొనసాగితే మండల ప్రజల గతి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఇదిలా ఉండగా మండలంలోని గ్రామ సచివాలయాల్లో కూడా పూర్తిస్థాయి సిబ్బంది లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన బదిలీల నేపథ్యంలో అనేక సచివాలయాల్లో ఖాళీలు ఏర్పడి సేవలు సరిగా అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ సేవలు అందించే సిబ్బంది లేకపోవడంతో ఆధార్కు సంబంధించిన పనులు దాదాపు నిలిచిపోయాయని ప్రజలు వాపోతున్నారు.
గత వైసీపీ పాలనలో సిబ్బంది కొరత లేక పనులు వేగంగా జరిగేవని, ప్రస్తుతం అనేక కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేక ప్రజలు తిరుగుతూ అలసిపోతున్నారని వారు పేర్కొంటున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో కూడా కొంతకాలం రోజుకో ఇన్చార్జ్ తోనే పరిపాలన సాగగా, ఇటీవల రెగ్యులర్ ఎంపీడీవో బళ్లా రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడిందని అంటున్నారు.
ఇప్పటికైనా మంత్రి పార్థసారథి చాట్రాయి మండలంపై ప్రత్యేక దృష్టి సారించి రెగ్యులర్ తహసిల్దార్ను నియమించాలని, సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలు మరింత పెరిగి జటిలంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి