బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!
బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!
Biksham
42, 43 వార్డుల్లో అనుమానాస్పద వ్యక్తి సంచారం – సీసీ కెమెరాల ఏర్పాటు కోరిన కాలనీవాసులు
సూర్యాపేట:
పట్టణంలోని 42, 43వ వార్డుల్లో బుర్కా ధరించి తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తి దొంగతనాలకు యత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అంజలి పాఠశాల – నిర్మల ఆసుపత్రి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ఆ వ్యక్తి సంచరిస్తూ గల్లీలు గమనిస్తూ రెక్కీ నిర్వహించినట్లు కాలనీవాసులు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జనసంచారం లేని వీధుల్లో తిరుగుతూ వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో 42వ వార్డులో ఓ వృద్ధురాలు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్న వేళ ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు లాగేందుకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. మెడపై చేయి వేసిన వెంటనే ఆమె గట్టిగా అరిచడంతో చుట్టుపక్కల వారు బయటకు రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు.
ఇలాంటి సంఘటనలు మరెక్కడైనా జరిగే ప్రమాదం ఉందని భయపడుతున్న 42, 43వ వార్డుల ప్రజలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెండు వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల నాగార్జున, 43వ వార్డు కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ రమేష్ ద్వారా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పోలీస్ శాఖ అధికారులు స్పందించి అనుమానాస్పద వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, వృద్ధులు, పిల్లలకు రక్షణ కల్పించాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి