భువనగిరి మైనార్టీ గురుకుల విద్యార్థి ఆకాష్ మృతి… న్యాయం కోసం ఆస్పత్రి ఎదుట అఖిలపక్ష ధర్నా
భువనగిరి మైనార్టీ గురుకుల విద్యార్థి ఆకాష్ మృతి… న్యాయం కోసం ఆస్పత్రి ఎదుట అఖిలపక్ష ధర్నా
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భువనగిరి మైనార్టీ గురుకులంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విద్యార్థి ఆకాష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఏరియా హాస్పిటల్ వద్ద అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు.
ఆస్పత్రి రోడ్డుపై చేపట్టిన ఈ ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థి సంఘాల నాయకులు–పోలీసుల మధ్య స్వల్పంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.
కుటుంబానికి భారీ ఎక్స్గ్రేషియా డిమాండ్
ఆందోళనకారులు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు డిమాండ్లు చేశారు.
మృత విద్యార్థి కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్గ్రేషియా
కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు
ఆకాష్ మృతికి కారకులైన సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి
అని గట్టిగా నినదించారు.
ఈ ధర్నాలో మృత విద్యార్థి కుటుంబ సభ్యులతో పాటు పలు ప్రముఖులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏవీ కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, సుభాష్, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ ఎడ్ల మహలింగం యాదవ్, చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి తదితరులు హాజరయ్యారు.
విచారణపై అనుమానాలు
విద్యార్థి మృతి వెనుక అసలు కారణాలు వెలుగులోకి రావాలని, పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తారు.
ప్రభుత్వం తక్షణ స్పందన ఇవ్వకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి