భూ పంపిణీ నిషేధం ఎత్తివేయాలి సాగు చేసుకుంటున్న పేదలకు పాసుబుక్కులు ఇవ్వాలి: బొల్లు యాదగిరి
భూ పంపిణీ నిషేధం ఎత్తివేయాలి సాగు చేసుకుంటున్న పేదలకు పాసుబుక్కులు ఇవ్వాలి: బొల్లు యాదగిరి
Editor Desk
భువనగిరి: జిల్లాలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధాన్ని ఎత్తివేసి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేదలందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం భువనగిరిలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఐదు మండలాల్లో భూ పంపిణీ నిలిచిపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు భూమిలేని పేదలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద రూ.12 వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు.
ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు కీలకమైన ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను గ్రామీణ కార్మికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 15న ఉపాధి హామీ రక్షణ కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామీణ సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం 15 మందితో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా నోముల జ్యోతి, కార్యదర్శిగా పల్లెర్ల అంజయ్య, ఉపాధ్యక్షులుగా కొండపురం యాదగిరి, మాణిక్యం, సహాయ కార్యదర్శులుగా కూకుట్ల చొక్కాకుమారి, నరాల చంద్రయ్య, బొల్లెపల్లి కిషన్లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, బోడ ఆంజనేయులు, రవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి