బీజేపీ 12 ఏళ్ల పాలన అస్తవ్యస్తం ప్రజలపై పెరుగుతున్న ధరల భారం: సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్
బీజేపీ 12 ఏళ్ల పాలన అస్తవ్యస్తం ప్రజలపై పెరుగుతున్న ధరల భారం: సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్
Editor Desk
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలపై భారాలు మోపుతూ ముందుకు సాగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ విమర్శించారు.
సోమవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సింగన్నగూడెం బైపాస్లో కామ్రేడ్ బట్టుపల్లి శ్రీనివాస్ 15వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ అరుణ పతాకాన్ని సీపీఎం సీనియర్ నాయకుడు కొలుపుల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం "బీజేపీ 12 ఏళ్ల పాలన – విద్వేషం, వైఫల్యాలు" అంశంపై సెమినార్ నిర్వహించారు.
జహంగీర్ మాట్లాడుతూ.. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.72గా ఉండేదని, ప్రస్తుతం చమురు ధర 96 డాలర్లకు తగ్గినా పెట్రోల్ ధర రూ.110కు చేరిందని అన్నారు. కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్రాల వ్యాట్, డీలర్ల కమిషన్లు కలిసి ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని విమర్శించారు.
నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ లేకుండా పెరుగుతున్నాయని, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2014లో డాలర్ విలువ రూ.58 ఉండగా ప్రస్తుతం రూ.96కు చేరడం ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
రైతు వ్యతిరేక చట్టాలు, విత్తన చట్టం, వాణిజ్య ఒప్పందాల వల్ల రైతులు నష్టపోతున్నారని, లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలు జరుగుతున్నాయని, కొత్త విధానాల వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.
మత విద్వేషాలను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, బీఎస్పీ నాయకుడు బట్టు రామచంద్రయ్య, కౌన్సిలర్ చీమల రాజు, సీపీఎం నాయకులు మాటూరి బాలరాజు గౌడ్, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి