బీదర్-జహీరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకు దుర్మరణం, మొత్తం ఐదుగురు మృతి
బీదర్-జహీరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకు దుర్మరణం, మొత్తం ఐదుగురు మృతి
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ / బీదర్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బీదర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జహీరాబాద్–బీదర్ రహదారిపై శంషల్లాపూర్ సమీపంలో ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ దారుణ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంలో తెలంగాణలోని మిర్జాపూర్(బి) గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకులు నర్సింహులు (48), అరుణ్ (20) అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు న్యాల్కల్ మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న దాదాపు 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమై అద్దాలు చెల్లాచెదురయ్యాయి.ఘటనతో బీదర్–జహీరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ దుర్ఘటన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి