బాల కార్మికత్వంపై కఠిన నిఘా – చట్ట ఉల్లంఘనలకు శిక్షలు తప్పవు: జిల్లా ఎస్పీ
బాల కార్మికత్వంపై కఠిన నిఘా – చట్ట ఉల్లంఘనలకు శిక్షలు తప్పవు: జిల్లా ఎస్పీ
Krishna
జిల్లాలో బాల కార్మికత్వ నిర్మూలన లక్ష్యంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో జనవరి 1 నుంచి జనవరి 31, 2026 వరకు ఆపరేషన్ స్మైల్ పన్నెండవ దశ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల కార్మికత్వం సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అత్యంత కీలక సమస్యలలో ఒకటని పేర్కొన్నారు. ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు పనుల్లో నిమగ్నమై ఉంటే వారు బాల కార్మికులుగా పరిగణించబడతారని, పిల్లలను పనుల్లో ఉపయోగించడం వారి మౌలిక హక్కులను కాలరాసినట్లేనని స్పష్టం చేశారు.వ్యవసాయం, గనులు, తయారీ రంగాలు, నిర్మాణ పనులు, పరిశ్రమలు, కర్మాగారాలు, హోటళ్లు, రైల్వే కేంద్రాలు, బస్ కేంద్రాలు, భిక్షాటన వంటి అనేక రంగాల్లో పిల్లలను కార్మికులుగా వినియోగిస్తున్నారని తెలిపారు.దీని వల్ల పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం కోల్పోతున్నారని,విద్యకు దూరమవడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే సరైన విద్య, పోషకాహారం, శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, సహపాఠులతో పోటీ పడే సామర్థ్యం ఎంతో అవసరమని అన్నారు.సరైన మార్గదర్శనం,నైపుణ్యాభివృద్ధికుటుంబ సహకారం లేకపోతే బాల కార్మికత్వంలో చిక్కుకున్న పిల్లలు నేర కార్యకలాపాల వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.నేటి పిల్లలే రేపటి పౌరులు అని, దేశ అభివృద్ధికి వారు పునాదులని అన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో కూడా బాల కార్మికత్వం కొనసాగడం బాల్యాన్ని నాశనం చేస్తోందని, బాల కార్మికత్వం లేని ఆరోగ్యవంతమైన పిల్లలతో కూడిన సమాజమే అభివృద్ధిలో ముందుంటుందని స్పష్టం చేశారు.పేదరికం, నిరక్షరాస్యత, తక్కువ ఆదాయం, కుటుంబాలు మౌలిక అవసరాలు తీర్చలేని పరిస్థితులు వంటి కారణాల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపాల్సి వస్తోందని తెలిపారు. దీని కారణంగా పిల్లలు చిన్న వయస్సులోనే కష్టాలకు గురై అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.బాల కార్మికత్వం నుంచి పిల్లలను విముక్తి చేయాలనే లక్ష్యంతో 2014 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను పోలీస్ శాఖ అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలను పనిస్థలాల నుంచి రక్షించి పాఠశాలల్లో చేర్పించడం, తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులతో కలిపి, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తున్నామని వివరించారు.బాల కార్మికత్వం ఎక్కడైనా కనిపిస్తే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా అత్యవసర నంబర్ 112 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలను బానిస కార్మికులుగా, భిక్షాటనకు, పశువుల కాపరులుగా, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు తదితర ప్రాంతాల్లో పనిచేయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ ఏడాది ఆపరేషన్ స్మైల్ పన్నెండవ దశలో భాగంగా బాల కార్మికులను నియమించిన యజమానులపై 93 కేసులు నమోదు చేయగా, 122 బాలురు మరియు 11 బాలికలు కలిపి మొత్తం 133 మంది పిల్లలను రక్షించి పునరావాసం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీస్ అధికారి అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి