బైక్ల దొంగతనమే 'జల్సా' ముగ్గురు మైనర్ల ముఠా అరెస్టు..
బైక్ల దొంగతనమే 'జల్సా' ముగ్గురు మైనర్ల ముఠా అరెస్టు..
NM Yadav
నల్గొండ టూటౌన్ పోలీసుల అప్రమత్తత నాలుగు వాహనాల స్వాధీనం..
నల్గొండ : వయసు చూస్తే పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు.. కానీ నేర ప్రవృత్తిలో మాత్రం ఆరితేరిపోయారు. విలాసాలకు అలవాటుపడి, అడ్డదారిలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ముగ్గురు మైనర్ల ఆట కట్టించారు నల్గొండ టూటౌన్ పోలీసులు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు ₹3.5 లక్షల విలువైన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
సినిమా స్టైల్లో స్కెచ్..
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు ముగ్గురూ మైనర్లు కావడంతో పాటు స్థానికులే కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. రాత్రి సమయాల్లో కాలనీల్లో తిరుగుతూ ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులపై కన్నేసేవారు. అదను చూసి వాహనాన్ని మాయం చేయడంలో వీరు సిద్ధహస్తులు. దొంగిలించిన తర్వాత ఆ వాహనాల నంబర్ ప్లేట్లు మార్చడం, రంగు రంగుల స్టిక్కర్లు అంటించడం, చివరకు విడిభాగాలను మార్చేయడం వంటి పనులను అచ్చం సినిమా తరహాలో ప్లాన్ చేసేవారని పోలీసులు గుర్తించారు. వరుస దొంగతనాలతో టూటౌన్ పోలీసులకు సవాల్గా మారిన ఈ కేసును సీఐ రాఘవరావు పర్యవేక్షణలో ఎస్సై సైదులు నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఛేదించింది. పట్టణంలోని సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. చివరకు పక్కా సమాచారంతో ఈ 'బుడతల గ్యాంగ్'ను పట్టుకున్నారు.రికవరీ చేసిన వాహనాలు 3 హోండా యాక్టివా స్కూటర్లు, ఒక పల్సర్ NS 200 బైక్, నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో వారిని జువైనల్ హోంకు తరలించారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన కానిస్టేబుళ్లు ఎండీ షకీల్, బాలకోటిలను జిల్లా ఎస్పీ , డీఎస్పీ శివరాం రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఎంతటి నేరగాళ్లైనా పోలీసు నిఘా నుంచి తప్పించుకోలేరని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి