బీజేపీకి దేశ ప్రజలే సరైన బుద్ధి చెప్తారు: బీర్ల ఐలయ్య
బీజేపీకి దేశ ప్రజలే సరైన బుద్ధి చెప్తారు: బీర్ల ఐలయ్య
స్థానికం బృందం
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వం
బీజేపీకి దేశ ప్రజలే సరైన బుద్ధి చెప్తారు: బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి, స్థానికం ప్రతినిధి
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్రామ్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని దోషులుగా చిత్రీకరించేందుకు మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఈసీ వంటి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. గత పదేళ్లుగా నేషనల్ హెరాల్డ్ కేసును అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నేతలను వేధించడం దురదృష్టకరమన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, మతం, కులాన్ని అడ్డుపెట్టుకొని దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శించారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ కార్యాలయం ముట్టడిస్తామని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, తంగెళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కూర వెంకటేష్, పడిగెల ప్రదీప్, ఈరపాక నరసింహ, దర్గాయి హరిప్రసాద్, పిట్టల బాలరాజ్, శివకుమార్, రాచమల్ల రమేష్, మంచికంటి కృష్ణమూర్తి, బీస్కుంట్ల సత్యనారాయణ, చిన్నగారి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి