అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం పేరుతో కేశవరావు కమిటీ నివేదిక కోసం కాలయాపన చేయకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ అధికారిక గుర్తింపు, సంక్షేమ పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి వృథా కాకూడదని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన గుర్తింపుతో సమానంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా గౌరవం, గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తే ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని, అదే హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించి ఉద్యమకారులను నిరాశపరిస్తే రాబోయే ఎన్నికల్లో తీవ్ర రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అలాగే తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఏర్పాటు చేస్తున్న సంఘాల పట్ల ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నాలను ఉద్యమకారులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఈ సందర్భంగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి