ఆరోగ్యానికి యోగా.. ఉల్లాసానికి 'సండే - హ్యాపీ డే'
ఆరోగ్యానికి యోగా.. ఉల్లాసానికి 'సండే - హ్యాపీ డే'
K.RAVI
* పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
* మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
శారీరక ధృడత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక పైలాన్ పార్క్లో 'సండే హ్యాపీ డే' వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు, వాకర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ,"సమాజం కోసం తెల్లవారుజామునే నిద్రలేచి శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. నిత్యం కష్టపడే వారు తమ అలసటను మర్చిపోయి, ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది."
రీల్స్ వద్దు.. వ్యాయామమే ముద్దు:
నేటి కాలంలో సెల్ ఫోన్లలో అధికంగా 'రీల్స్' చూడటం వల్ల శారీరక జడత్వంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి, క్రీడలు, వ్యాయామం వైపు మొగ్గు చూపాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా కృషి చేసి చౌటుప్పల్ను 'స్వచ్ఛ, ఆరోగ్యకరమైన నగరంగా' తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులు, స్థానికులు ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. యోగాసనాలు వేస్తూ, వ్యాయామాలు చేస్తూ పార్కులో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, 2వ వార్డు కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మి, నాయకులు చింతల సాయిలు, పోలేపల్లి ముత్తయ్య, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కె. హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ ఎం. రేణు కుమార్, జవాన్లు అంజయ్య, నరసింహ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి