న్యాయ సేవల్లో ఐదేళ్ల మైలురాయి పూర్తి
ప్రజలకు చేరువైన వేగవంతమైన న్యాయం: ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి
చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు నేటితో ఐదేళ్ల విజయవంతమైన న్యాయ సేవలను పూర్తి చేసుకుని ఆరవ వసంతంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషకరమని చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు చిన్నచిన్న కేసుల కోసం కూడా రామన్నపేట కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, దీంతో సమయం, డబ్బు వృథా అయి వ్యయప్రయాసలు ఎదుర్కొనేవారని గుర్తుచేశారు. జాతీయ రహదారి వెంట, పరిసర మండలాల ప్రజలకు అనువైన ప్రదేశంగా ఉన్న చౌటుప్పల్లో కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో 2021 సెప్టెంబర్ 16న ఈ కోర్టు ప్రారంభమైందన్నారు. గత ఐదేళ్ల కాలంలో స్థానిక ప్రజలకు సుదీర్ఘ ప్రయాణ భారం తప్పి, పారదర్శకమైన, వేగవంతమైన న్యాయం చేరువైందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఎన్నో సివిల్, క్రిమినల్ కేసులను నిష్పక్షపాతంగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించామన్నారు. చట్టాలపై మహిళలు, యువతకు అవగాహన కల్పించేందుకు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించామని తెలిపారు. రాజీపడదగ్గ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించి కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించినట్లు చెప్పారు. ఈ ప్రస్థానంలో సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు శాఖ, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే పారదర్శకతతో ప్రజలకు మరింత వేగంగా న్యాయ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి