ఆర్టిజన్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం...ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఆర్టిజన్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం...ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
NM Yadav
ప్రభుత్వం చర్చలకు పిలిచి సమ్మెను నివారించాలని డిమాండ్..
నల్లగొండ : విద్యుత్ సంస్థలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టిజన్లను ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసనలో పాల్గొన్న ఆయన కార్మికులకు తన పూర్తి మద్దతును ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిజన్లు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
గత 22 సంవత్సరాలుగా విద్యుత్ రంగం పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న వీరిని విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలని కోరారు. గత ప్రభుత్వం వీరిని గుర్తించినప్పటికీ ప్రస్తుత అధికారులు బ్రిటిష్ కాలం నాటి పాత నిబంధనలను సాకుగా చూపుతూ రెగ్యులర్ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు మధ్య వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీఐ పూర్తి చేసిన వారిని జూనియర్ లైన్ మెన్లుగా, డిప్లొమా చేసిన వారిని సబ్ ఇంజనీర్లుగా మరియు ఇతరులను విద్యార్హతను బట్టి ఆఫీస్ సబార్డినేటర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.అరకొర వేతనాలతో జీవనం సాగిస్తున్న ఆర్టిజన్లకు ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరి వీడి కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, గీతా పనివారల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బు వీరస్వామి, జేఏసీ జిల్లా చైర్మన్ జిట్టబోయిన లింగస్వామి, నాయకులు గుండ లింగారెడ్డి, పెరిక శేఖర్, వేణుగోపాల్ రెడ్డి, మురళి, అద్దంకి వెంకన్న, లతీఫ్, విజయ్, ఉమాదేవి, నాగమణి, రమ్య, సతీష్, ప్రవీణ్, రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి