అక్షరాస్యతే ఆయుధం – నూతన పాలకవర్గానికి ప్యారీ బేగం పిలుపు
అక్షరాస్యతే ఆయుధం – నూతన పాలకవర్గానికి ప్యారీ బేగం పిలుపు
Editor Desk
సంపూర్ణ అక్షరాస్యతే గ్రామ అభివృద్ధికి పునాది – ప్యారీ బేగం
యాదగిరిగుట్ట స్థానికం ప్రతినిధి
గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేయాలని గోల్కొండ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్యారీ బేగం పిలుపునిచ్చారు.
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్, వార్డు సభ్యులను గోల్కొండ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లేలా చూడాలని, గ్రామాల్లో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, బాల్య వివాహాలు జరగకుండా పాలకవర్గం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లి పేరుతో చదువుకు దూరం చేయవద్దని హితవు పలికారు.
పాఠశాల కరస్పాండెంట్ షేక్ మంజుబాబ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలై మద్యం, బెట్టింగ్లు, అప్పుల ఊబిలో చిక్కుకుని చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నూతన పాలకవర్గం చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామ సర్పంచ్ కళ్లెం జుహంగీర్ మాట్లాడుతూ వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాశం సంగీత, చల్లూరు ఉప సర్పంచ్ బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు షేక్ షరీఫ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, నూతన వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి