అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు
Biksham
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా పోలీసు అధికారి నరసింహతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆరు ఇసుక నిల్వ ప్రాంతాల్లో అక్రమ రవాణా వాహనాలు పట్టుబడితే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్లైన్లో నమోదు చేపట్టాలని, ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ బృందం నిరంతరం ఇసుక నిల్వ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో ఆమోదం పొందిన 729 ఇసుక ట్రాక్టర్లకు గుర్తింపు కోసం రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ మరియు వాహన గుర్తింపు కెమెరాల పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఇసుక రవాణా ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ కోసం ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనుమతి లేని వాహనాలు గుర్తిస్తే వెంటనే నిరోధించాలని స్పష్టం చేశారు.
తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు ఇసుక నిల్వ ప్రాంతాలను సందర్శించాలని, అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుందని, గ్రామ పంచాయతీ కార్యదర్శి అవసరాన్ని నిర్ధారించి తహసీల్దార్ పర్యవేక్షణలో నమోదు చేపడతారని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, రెవెన్యూ విభాగాధికారి వేణు మాధవరావు, గనుల శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి