అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు: ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు: ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
K.RAVI
చౌటుప్పల్ మండలంలో విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్టు
చౌటుప్పల్ మండలంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకోవడంపై ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు.విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం శాంతియుతంగా చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని వారు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ విద్యార్థులకు స్కాలర్షిప్ అందకపోవడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి -2020) అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు.రాష్ట్ర యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు వరుణ్, మండల నాయకులు రాజు, పెరియర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి