ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్
Editor Desk
నల్గొండ,
ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలు, గడువు తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. కల్తీ ఆహారం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో “ఈట్ రైట్–స్టే హెల్తీ” పేరుతో నిర్వహించిన వాక్థాన్ను క్లాక్టవర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆహార భద్రత శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ఆహారంతో పాటు వ్యాయామం కూడా దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. కల్తీ ఆహారాన్ని గుర్తించి వెంటనే ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటారని చెప్పారు.
నల్గొండ పట్టణంలో సుమారు 100 మంది వీధి వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ శాఖ ద్వారా లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యాపారులు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
ఈ నెల 6 నుంచి 11 వరకు నిర్వహిస్తున్న “ఆరోగ్య వారోత్సవం”లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రచార వాహనం ద్వారా పది రోజుల పాటు జిల్లాలో పర్యటించి కల్తీ ఆహారం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆహార భద్రత అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి