అధికారుల నిర్లక్ష్యంపై ఫస్ట్ వార్డు ప్రజల ఆగ్రహం
అధికారుల నిర్లక్ష్యంపై ఫస్ట్ వార్డు ప్రజల ఆగ్రహం
Komidala Mahender reddy
వారం రోజులుగా నీటి బొట్టు దొరకక విలవిల.. ట్రాన్స్ఫార్మర్ వైఫల్యంతో శివనేనిగూడెంలో తాగునీటి సంక్షోభం
సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా హెచ్చరిక.
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెంలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. గత వారం రోజులుగా స్థానిక ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఉన్న బోరు మోటార్లు నిలిచిపోవడంతో సాగునీటి సమస్య తలెత్తగా, అదే విద్యుత్ కనెక్షన్పై ఆధారపడిన వాటర్ ప్లాంట్ కూడా పూర్తిగా మూతపడింది.
ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీటి అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వారం రోజులుగా వాటర్ ప్లాంట్ బంద్ కావడంతో ఫస్ట్ వార్డు ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.
సొంత వాహనాలు ఉన్నవారు చిట్యాల పట్టణానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటుండగా, వృద్ధులు, పేద కుటుంబాలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకునే శక్తి లేక, తాగునీరు దొరకక ఈ ఎండాకాలంలో నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే గ్రామ యువకులు, ప్రజలు పలుమార్లు సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు "చూస్తాం.. చేస్తాం" అనే హామీలకే పరిమితమవుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి విషయంలో ఇంత నిర్లక్ష్య ధోరణి తగదని స్థానిక యువత మండిపడుతోంది.ట్రాన్స్ఫార్మర్ను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి, నిలిచిపోయిన వాటర్ ప్లాంట్ను వెంటనే పునరుద్ధరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే ఫస్ట్ వార్డు ప్రజలందరూ మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ప్రజలకు తాగునీరు అందించడంలో విఫలమైన మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులే ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి