ఆరోపణలు మానేసి ప్రజా సమస్యలపై చర్చించాలి
ఆరోపణలు మానేసి ప్రజా సమస్యలపై చర్చించాలి
Biksham
పాలమూరు–రంగారెడ్డికి నిధుల్లో అన్యాయం: జాన్ వెస్లీ
ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి
యూరియా యాప్తో రైతులకు ఇబ్బందులు
సిపిఐ(ఎం )సూర్యాపేట జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట: అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నాయని, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జివివి గార్డెన్లో జరిగిన సిపిఐ (ఎం) సూర్యాపేట జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. ఇప్పటివరకు కేవలం 32 వేల కోట్ల రూపాయలే కేటాయించారని, ఇంకా 42 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. భూ సేకరణ, కాలువల నిర్మాణం, నిర్వాసితులకు నష్టపరిహారం వంటి అంశాల్లో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో వివక్షత లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు జారీ చేయాలన్నారు. ఒక్క జర్నలిస్టుకైనా నష్టం కలిగేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని, మహిళలకు నెలకు 2,500 రూపాయల హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు.
పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీ పేరుతో ఉన్న పథకానికి పేరు మార్చడం మహాత్ముని అవమానించడమేనని అన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపడం అన్యాయమన్నారు.
యూరియా కోసం యాప్ ద్వారా బుకింగ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజనులు, నిరక్షరాస్య రైతులకు యాప్ ఉపయోగించడం సాధ్యం కాదని, వెంటనే పాత విధానంలోనే యూరియా సరఫరా చేయాలని కోరారు. ఇప్పటికే గ్రామాల్లో యూరియా కొరత ఉందని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని ఆరోపించారు. సామాజిక సమస్యలపై స్పందించే వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇటీవల గాదే ఇన్నయ్య అరెస్టును తీవ్రంగా ఖండించారు.
సమావేశానికి ముందు సిపిఐ (ఎం) సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు.
ఈ సమావేశానికి సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, కొలిశెట్టి యాదగిరిరావు, కోట రమేష్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి