ఆపరేషన్ లేకుండానే అరుదైన వ్యాధికి చికిత్స
ఆపరేషన్ లేకుండానే అరుదైన వ్యాధికి చికిత్స
Biksham
అకాలేసియా కార్డియా బాధితురాలికి ఉపశమనం
మలకపేట యశోద ఆసుపత్రి వైద్య బృందం విజయం
స్థానికం ప్రతినిధి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన అరవై మూడు ఏళ్ల మహిళ ఆహారం మింగలేని అరుదైన వ్యాధి అకాలేసియా కార్డియాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మలకపేట యశోద ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో శస్త్రచికిత్స అవసరం లేకుండా విజయవంతంగా చికిత్స అందించారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డు భాస్కర ఇన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్ కిషన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ చిదుర శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు.
గత కొంతకాలంగా ఆ మహిళ ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. సమగ్ర వైద్య పరీక్షలు, ప్రత్యేక ఎండోస్కోపిక్ పరిశీలనలో ఆమెకు టైప్ వన్ అకాలేసియా కార్డియా ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు.
దీంతో డాక్టర్ ఎన్ కిషన్ పర్యవేక్షణలో అత్యాధునిక పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటోమీ అనే చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండానే అన్నవాహిక కండరాల ఒత్తిడిని తగ్గించి, ఆహారం సులభంగా లోపలికి వెళ్లేలా చేసినట్లు వివరించారు.చికిత్స అనంతరం రోగి ఆహారం మింగే సామర్థ్యం పూర్తిగా మెరుగుపడిందని, ఎలాంటి సంక్లిష్టతలు తలెత్తలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం వేగంగా కోలుకుంటోందని పేర్కొన్నారు.యశోద ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య బృందం సమగ్ర నిర్వహణ వల్లే ఈ క్లిష్టమైన చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.ఈ కార్యక్రమంలో మలకపేట యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ వాసుకిరణ్ రెడ్డి, ఏజీఎం వినయ్ కుమార్, మేనేజర్ స్వాగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి