నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం
నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం
స్థానికం బృందం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు
నారాయణఖేడ్, ప్రతినిధి:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గ్రామ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నగల్ గిద్ద మండల పరిధిలోని వల్లూర, ముక్తాపూర్, లింగాపూర్, మాధ్వర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు అందాయని తెలిపారు. ఇది కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే ప్రజల విశ్వాసానికి కారణమని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నందుకు మండల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితభావంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేపట్టామని స్పష్టం చేశారు.
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామ ముఖ్య కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి