44వ వార్డులో బిక్కుమల్ల మంజుల ఉపేందర్కు భారీ మెజారిటీతో గెలుపు అందించాలి
44వ వార్డులో బిక్కుమల్ల మంజుల ఉపేందర్కు భారీ మెజారిటీతో గెలుపు అందించాలి
Biksham
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు
సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిక్కుమల్ల మంజుల ఉపేందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం 44వ వార్డులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు తల్లి మంజుల ఉపేందర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజలంతా ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి కుటుంబాన్ని ఓదార్చి, పూర్తి స్థాయిలో అండగా నిలిచారని గుర్తు చేశారు.సూర్యాపేటలో గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజా సమస్యలు పెరిగాయని, దోమలు, పందుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలుకాలేదని, మహిళలకు నెలకు రెండువేల ఐదు వందల రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, పెన్షన్ల పెంపు, మహిళలకు స్కూటీలు, రైతుబంధు పదిహేను వేల రూపాయల హామీలు నెరవేరలేదన్నారు.బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో ఎక్కడా అరాచకాలు, రౌడీయిజం లేకుండా శాంతిభద్రతలను కాపాడామని, వ్యాపారులకు అండగా నిలిచామని తెలిపారు. మున్సిపాలిటీలో భవన నిర్మాణాల విషయంలో ఎవరినీ బెదిరించే పరిస్థితి లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో 44వ వార్డు ప్రజలు బిక్కుమల్ల మంజుల ఉపేందర్కు మద్దతు ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా క్రమశిక్షణ సంఘం చైర్మన్ బండారు రాజా, జిల్లా కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, సయ్యద్ సలీం, రాచర్ల కమలాకర్, వాసవి క్లబ్ సభ్యులు కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, బిక్కుమల్ల కృష్ణ, చల్ల లక్ష్మి ప్రసాద్, యామా ప్రభాకర్, కొండ్లె రంగయ్య, మిట్టపల్లి రమేష్, మనసాని నాగేశ్వరరావు, పోల రాధాకృష్ణ, రిటైర్డ్ సైనికులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి