30 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
30 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
Editor Desk
ఆల్ఫా హై స్కూల్ 1993–96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రామన్నపేట – స్థానికం ప్రతినిధి
కాలం దూరం చేసిన స్నేహ బంధాలు, మూడు దశాబ్దాల అనంతరం మళ్లీ కలిశాయి. బాల్య జ్ఞాపకాలతో నిండిన స్నేహాలు మరోసారి హృదయాలను దగ్గర చేసుకున్నాయి. ఆల్ఫా హై స్కూల్ 1993–96 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం భావోద్వేగాలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగింది.
గురువారం రామన్నపేట పట్టణ కేంద్రంలో జరిగిన ఈ రీయూనియన్కు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల జీవితం ఇచ్చిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పటి అనుభవాలు, గురువుల మార్గదర్శకత్వం, విద్యార్థి దశలోని సరదా క్షణాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. కాలం ఎంత మారినా స్నేహం మాత్రం అలాగే నిలిచిందని ఈ కలయిక మరోసారి రుజువు చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాటి ఉపాధ్యాయులను పూల వర్షంతో, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సమావేశంలో, ఇటీవల మృతి చెందిన సహచర విద్యార్థిని బట్టె సంతోషిని స్మరించుకుంటూ గురువులు, విద్యార్థులు రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు.
విద్యార్థుల స్వీయ పరిచయంతో మొదలైన కార్యక్రమం, జీవిత ప్రయాణంలోని అనుభవాలను పంచుకునే వేడుకగా మారింది. గురువులు అందించిన విలువలు తమ జీవితాలకు బలంగా నిలిచాయని పలువురు విద్యార్థులు భావోద్వేగంగా వెల్లడించారు. పాఠశాల నేర్పిన క్రమశిక్షణ, బాధ్యత, మానవ విలువలు తమ విజయాలకు పునాదిగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆల్ఫా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్, సత్యనారాయణ, సురేష్, మమత, అస్మత్ ఉన్నీసా మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల తర్వాత అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యతో పాటు విలువలను కూడా విద్యార్థులు తమ జీవితాల్లో నిలుపుకున్నారని ప్రశంసించారు. మంచి మనిషిగా ఉండడమే నిజమైన విజయమని పేర్కొన్నారు.
మల్లికార్జున్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ పాఠశాల నుంచి చదువుకున్న అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఇలాంటి వేదిక ద్వారా పుట్టిన ఊరు, ఊరి ప్రజల కోసం సామాజిక, వైద్య సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇదే తమకు విద్యార్థులు ఇచ్చే నిజమైన గురుదక్షిణ అని అన్నారు. దీనికి స్పందించిన పూర్వ విద్యార్థులు సాధ్యమైన మేరకు సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
రీయూనియన్ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి, 30 ఏళ్ల రీయూనియన్ జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఉపాధ్యాయుల చేతులమీదుగా జ్ఞాపకాలు స్వీకరించి, గ్రూప్ ఫోటోతో కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భవాని, ఉమా, రజిత, వరలక్ష్మి, సర్ద చంద్రశేఖర్, మహమ్మద్ రఫీ, మహమ్మద్ ముస్తాక్ అలీ, తడకమళ్ళ చంద్రశేఖర్, రత్న మధు బాబు, పొట్ట రవి, బొల్లం శ్రీనివాస్, శంభాల ఆంజనేయులు, ఎదుగాని మహేందర్, వెంకన్న చారి, గర్దాసు ఉపేందర్, డాక్టర్ కల్యాణ వరప్రసాద్, మందాడి నవీన్ రెడ్డి, చెరుకు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి