150 ఏళ్ల ఇళ్లపై ‘ప్రోహిబిటెడ్’ ముద్ర.. దుబ్బాకలో ప్రజల ఆవేదన
150 ఏళ్ల ఇళ్లపై ‘ప్రోహిబిటెడ్’ ముద్ర.. దుబ్బాకలో ప్రజల ఆవేదన
Editor Desk
వందేళ్ల ఇళ్లకు ప్రభుత్వ ముద్ర?.. దుబ్బాకలో న్యాయం కోరుతున్న ప్రజలు
రామన్నపేట స్థానికం ప్రతినిధి
దుబ్బాక గ్రామంలో వందేళ్లకు పైగా నివాసంగా ఉన్న ఇళ్లపై ఒక్కసారిగా ప్రోహిబిటెడ్ ముద్ర పడటంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 150 సంవత్సరాలుగా గ్రామ కంఠం భూములుగా కొనసాగుతూ, పన్నులు చెల్లిస్తూ వస్తున్న 331 ఇండ్లను ఇటీవల ప్రభుత్వ ఇండ్లుగా గుర్తిస్తూ గ్రామ పంచాయతీలో నమోదు చేసినట్టు బాధితులు వాపోతున్నారు.
ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్ అయ్యి, వారసత్వంగా కొనసాగుతున్న ఇళ్లను ఇప్పుడు ప్రోహిబిటెడ్ జాబితాలో చేర్చి, సెక్రటరీ, తహసీల్దార్, కలెక్టర్ సంతకాలతో ఆన్లైన్లో మార్పులు చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీనివల్ల కొనుగోలు–అమ్మకాలు నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు రావడం లేదు. కోర్టుల్లో కూడా న్యాయపరమైన చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు.
రైతులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, ట్రాక్టర్ యజమానులు వంటి సామాన్య ప్రజలు ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే బజార్లో కొందరి ఇళ్లకు పట్టాలు ఉండగా, మరికొందరి ఇళ్లను ప్రోహిబిటెడ్గా నమోదు చేయడం అన్యాయమని విమర్శిస్తున్నారు.
వందేళ్లకు పైగా పన్నులు చెల్లిస్తూ వస్తున్న తమ ఇళ్లపై హక్కు కోల్పోయే పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొంటూ, తక్షణమే సర్వే–రిసర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ అధికారి నిర్ణయమా? మండల స్థాయి అధికారుల ఆదేశాలా? లేక పట్టాలు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటోందా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి