వృద్ధుల గౌరవానికి పెన్షన్నే భరోసా – రాపోలు నిర్మలానరసింహా
వృద్ధుల గౌరవానికి పెన్షన్నే భరోసా – రాపోలు నిర్మలానరసింహా
Editor Desk
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఫిర్యాదు ఆధారంగా వారి జీతంలో 10–15 శాతం కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టం చేస్తామని ప్రకటించిన విషయంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ రాపోలు నిర్మలానరసింహా స్పందించారు.తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయడం చాలా అరుదని, అది వారి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఫిర్యాదు చేస్తే కుటుంబ కలహాలు, అనవసర సమస్యలు తలెత్తుతాయనే భయంతో చాలామంది వృద్ధులు మౌనంగా మానసిక వేదన అనుభవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్న వాస్తవాన్ని విస్మరించలేమన్నారు. అందరూ అలా చేస్తున్నారని అనడం లేదని, కానీ కొంతమంది వృద్ధులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది నిజమన్నారు.ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసినా చేయకపోయినా తల్లిదండ్రుల ఖాతాల్లో కొంత మొత్తాన్ని జమ చేసేలా చట్టం చేయాలని, లేకపోతే ఎలాంటి షరతులు లేకుండా వయసును ప్రామాణికంగా తీసుకొని, ఉద్యోగాలు లేదా భూములు ఉన్నాయా లేవా అన్న తేడా లేకుండా అప్లై చేసుకున్న ప్రతి వృద్ధుడికి వృద్ధాప్య పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించిన వృద్ధులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవమే పెన్షన్ అని పేర్కొన్నారు. పెన్షన్ వస్తే వృద్ధులు ఆత్మాభిమానంతో, మానసిక ప్రశాంతతతో జీవిస్తారని అన్నారు.
న్యాయశాస్త్ర సూత్రాన్ని ఉదహరిస్తూ, వందమంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నట్లే తెలంగాణలో ఒక్క వృద్ధుడు కూడా కన్నీరు పెట్టుకోకుండా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో ఆలోచించి వృద్ధులందరికీ పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి