న్యాయం కోసం వెళ్తే నమ్మించి మోసం వివాహితపై లైంగిక దాడి ఆరోపణలు.. సీఐ రాజు నాయక్పై కేసు నమోదు
న్యాయం కోసం వెళ్తే నమ్మించి మోసం వివాహితపై లైంగిక దాడి ఆరోపణలు.. సీఐ రాజు నాయక్పై కేసు నమోదు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించిన సీఐ బానోత్ రాజు నాయక్పై వివాహిత మహిళపై లైంగిక దాడి చేసిన ఆరోపణలతో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పలువురు అధికారులను కలవరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి సీఐ రాజు నాయక్ను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలిసింది.
పోలీసుల వివరాల ప్రకారం, బాధిత మహిళ తన భర్త వేధింపులపై న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఆ సమయంలో అక్కడ సీఐగా పనిచేస్తున్న రాజు నాయక్, తాను సహాయం చేస్తానని, న్యాయం జరిగేలా చూస్తానని నమ్మకం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ప్రేమ, వివాహం పేరుతో ఆమెను మోసం చేసి లైంగికంగా దోపిడీ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
కొంతకాలానికి బాధిత మహిళ గర్భవతి కావడంతో వివాహంపై ప్రశ్నించగా, సీఐ రాజు నాయక్ ఒత్తిడి తెచ్చి గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాత్రలు బలవంతంగా మింగించి అబార్షన్కు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించినట్లు సమాచారం. ఈ నెల 7వ తేదీన ఆమె అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా, ఆరోపణల్లో నిజానిజాలు ఉన్నట్లు తేలినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని సీఐ రాజు నాయక్ను విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారిపైనే ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధిత మహిళకు పూర్తి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి