ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మార్చి 2న మహాధర్నా
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి వ్యతిరేకంగా మార్చి 2న మహాధర్నా
Editor Desk
ఉపాధి కూలీల సమస్యలపై పోరాటానికి పిలుపు
రామన్నపేట, : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను గ్రామీణ పేదలు తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి.రామ్ జి బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్చి 2న రామన్నపేట ఎంపీడీవో కార్యాలయం ముందు నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ జనంపల్లి, కక్కిరేణి, ఇస్కిళ్ళ, దుబ్బాక గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చే ప్రయత్నం సరికాదన్నారు. నూతన విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని, కేంద్రం తన 90 శాతం వాటాను 60 శాతానికి తగ్గించుకోవడం ద్వారా బాధ్యత నుంచి తప్పుకుంటోందని విమర్శించారు.
చేసిన పనికి నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండటం, కనీస వేతనం అందకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత విధానంలోనే చట్టాన్ని కొనసాగించి గ్రామీణ పేదలకు ఉపాధిని హామీ చేయాలని కోరారు.
మార్చి 2న జరిగే మహాధర్నాకు మండలంలోని వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, కందుల హనుమంతు, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ, గన్నేబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, పులి బిక్షమయ్య, గుండాల ప్రసాద్, గుండాల నరేష్, కన్నెబోయిన యాదయ్య, గట్టు గోపయ్య, పుట్టల ఉదయ్ కుమార్, కంబాలపల్లి మత్స్యగిరి, గట్టు రాజ్ కుమార్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి