తెలుగు భాషను ఎవరూ చంపలేరు. సముద్రాల ఉపేందర్
తెలుగు భాషను ఎవరూ చంపలేరు. సముద్రాల ఉపేందర్
Editor Desk
మాతృభాషే ఆత్మగౌరవానికి ఆధారం – డా. పగడాల నాగేందర్
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, విమర్శకులు డా. పగడాల నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్తంలో నాటుకుపోయిన తెలుగు భాషను ఎవరూ చంపలేరని స్పష్టం చేశారు. మనిషికి కలలు తన మాతృభాషలోనే వస్తాయని, సృజనాత్మకత కూడా అదే భాషలో వికసిస్తుందని అన్నారు. విద్యార్థులు రచన, కవిత్వం, విమర్శ రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వేమన, కాళోజి నారాయణరావు, శ్రీశ్రీ వంటి మహాకవులు తమ మాతృభాషలో రచనలు చేయడం వల్లనే ప్రజాదరణ పొందారని గుర్తుచేశారు. అమ్మభాషను గౌరవించడం అంటే అమ్మను గౌరవించినట్లేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణ భాషకు జరిగిన అన్యాయాలే స్వరాష్ట్ర సాధనకు కారణమయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషను ప్రతికూల పాత్రలకు మాత్రమే పరిమితం చేసేవారని, కానీ ఇప్పుడు అదే భాష గౌరవ స్థాయికి చేరిందన్నారు.
ప్రపంచంలోని అన్ని భాషలు గొప్పవేనని, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుండటంతో వారు ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్నారని వివరించారు.
గౌరవ అతిథి శీలం భద్రయ్య మాట్లాడుతూ ప్రస్తుతం మనిషికి మనిషికి పోటీ కాదని, మనిషికి యంత్రానికి పోటీ పెరిగిందన్నారు. కృత్రిమ మేధ పెరుగుతున్న ఈ కాలంలో మాతృభాషా విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
తూర్పు బెంగాల్లో మాతృభాష కోసం యువకులు ప్రాణత్యాగం చేసిన నేపథ్యంలోనే యునెస్కో 1999లో ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. భాషను రక్షించుకుంటే జాతిని రక్షించినట్టేనని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగాధిపతి డా. వెల్దండి శ్రీధర్, ఆంగ్ల విభాగాధిపతి డా. వై.వి.ఆర్. ప్రసన్నకుమార్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి