త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?
త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?
Biksham Goud
అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక సమావేశం
ఒకే విడతలో పోలింగ్కు కసరత్తు.. పరీక్షలు, బడ్జెట్ సమావేశాల దృష్ట్యా నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.మున్సిపల్ ఎన్నికల ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగిసేలా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో యంత్రాంగంపై భారం తగ్గడమే కాకుండా పాలనపై త్వరగా దృష్టి సారించవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది.
పరీక్షలు, బడ్జెట్ సమావేశాలపై చర్చ
రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చ జరగనుంది. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు, పదో తరగతి పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్నాయి. ఇదే సమయంలో మార్చి రెండో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలన్నదానిపై విద్యాశాఖ, ఎన్నికల సంఘం అధికారులతో ముఖ్యమంత్రి సమాలోచన చేయనున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఎన్నికలు వెంటనే నిర్వహించాలా? లేక పరీక్షల అనంతరం చేపట్టాలా? అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.రాష్ట్రంలో మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది జడ్పీటీసీ స్థానాలు, ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఈ స్థానాలు అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ స్థానాలను మార్చి నెలలోపు భర్తీ చేస్తే స్థానిక సంస్థలకు పెండింగ్లో ఉన్న ఐదు వందల కోట్ల రూపాయల పైగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను పొందేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి