తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం
తెలంగాణలో వీధి కుక్కలు – కోతుల బీభత్సం
స్థానికం బృందం
ప్రజల ప్రాణాలకు ముప్పు… ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో ప్రాణంబలి
స్థానికం ప్రతినిధి రామన్న పేట
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు, కోతుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల ప్రాణాలే లక్ష్యంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన దీనికి నిదర్శనం.
నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి అంజయ్యపై సుమారు 20 రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ సనత్నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అంజయ్య మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
గ్రామాల్లో వీధి కుక్కల గుంపులు స్వైరవిహారం చేస్తుండగా, మరోవైపు కోతుల బెడదతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా బాధితులవుతున్నారు. అయినా సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల నుంచి వీధి కుక్కలు, కోతులను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కూడా పెద్ద సవాలుగా మారింది. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించకపోతే, ఇలాంటి ఘటనలు మరిన్ని ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి