టెట్ ఫీజుల తగ్గింపు, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్ – బీఈడీ అభ్యర్థుల సంఘం ఉద్యమం వేగం
టెట్ ఫీజుల తగ్గింపు, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్ – బీఈడీ అభ్యర్థుల సంఘం ఉద్యమం వేగం
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
హైదరాబాద్: తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కుమార్ ఆధ్వర్యంలో అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం విద్యా శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. టెట్ పరీక్ష ఫీజుల తగ్గింపు నుండి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వరకు పలు కీలక డిమాండ్లను వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
మొదటగా, బీఈడీ అభ్యర్థుల ప్రతినిధి బృందం SCERT డైరెక్టర్ జి. రమేష్ను కలిసి టెట్ పరీక్షలపై తమ అభ్యర్థనలు వివరించారు. ఈ సందర్భంగా భూక్య కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెట్ పరీక్ష ఫీజులను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఒక్కో పేపర్కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 వసూలు చేయడం అభ్యర్థులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా టెట్ పరీక్ష కేంద్రాలను అభ్యర్థుల స్వగ్రామ జిల్లాల్లోనే కేటాయించాలని కోరారు. ప్రస్తుతం దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం వల్ల ప్రయాణ ఖర్చులు, వసతి సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా కొంతమంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేకపోతున్న పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
ఇంకా టెట్ పరీక్షను కేంద్ర స్థాయి CTET తరహాలో ఒకే రోజు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకే రోజు నిర్వహించలేని పరిస్థితిలో, అభ్యర్థుల మార్కులకు న్యాయం చేసేలా నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని సూచించారు. అలాగే మొబైల్ ఫోన్ ద్వారా టెట్ దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించాలని కోరారు. తరువాత ప్రతినిధులు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ బి.ఎంను కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2012లో విడుదలైన ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ తరువాత గత 14 సంవత్సరాలుగా మరో నోటిఫికేషన్ విడుదల కాలేదని గుర్తుచేస్తూ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.
అలాగే గురుకుల విద్యా సంస్థల డైరెక్టర్ బి. సైదులను కలిసి గురుకుల టీచర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే నియామకాలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా గురుకుల టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్లు, సాధారణ డీఎస్సీ పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ సాధన కమిటీ నాయకులు సోమేశ్ జాదవ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సంఘం నాయకులు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి