Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 12:50 AM

తెలంగాణ రాష్ట్రం లో తహశీల్దార్లకు తక్షణమే పదోన్నతులు కల్పించాలి

తెలంగాణ రాష్ట్రం లో తహశీల్దార్లకు తక్షణమే పదోన్నతులు కల్పించాలి

తెలంగాణ రాష్ట్రం లో తహశీల్దార్లకు తక్షణమే పదోన్నతులు కల్పించాలి
February 24, 2026 10:11 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నికలిసిన ట్రెసా ప్రతినిధి బృందం వినతి


రాష్ట్ర రెవెన్యూ శాఖలో పదోన్నతులు నిలిచిపోవడంతో దాదాపు 150 మంది తహశీల్దార్లు పదేళ్లకు పైగా ఎదురు చూపుల్లోనే ఉన్నారని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పదోన్నతుల నిలుపుదల కారణంగా దిగువ స్థాయి అధికారుల పదోన్నతుల ప్రక్రియ కూడా స్తబ్ధంగా మారిందని సంఘం తెలిపింది.

సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన శిబిర కార్యాలయంలో కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రభుత్వ పథకాల అమలు, భూవివాదాల పరిష్కారం, ప్రకృతి విపత్తుల సమయంలో సేవలు, ఎన్నికల నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్న తహశీల్దార్లకు అదనపు హోదాతో పదోన్నతులు మంజూరు చేయాలని కోరింది.

సమగ్ర ఆరోగ్య పథకానికి కృతజ్ఞతలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విరమణ పొందిన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ఆరోగ్య నిధి ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రికి సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొంది.

ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై అనిశ్చితి

రెవెన్యూ శాఖలో సుమారు 632 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అనేక సంవత్సరాలుగా కీలక సేవలు అందిస్తున్నారని సంఘం వివరించింది. భూ రికార్డుల నిర్వహణ, ధరణి వ్యవస్థలో నమోదు పనులు, ప్రజా సేవల అందజేత వంటి ముఖ్యమైన బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత వీరి సేవలను కొనసాగించరాదన్న ఆదేశాలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని, శాఖలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో వారి సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది.

వేతన సవరణపై వేగం అవసరం

పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనుదారుల వేతన సవరణను త్వరితగతిన అమలు చేయాలని సంఘం కోరింది. వేతన సవరణతో లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడింది.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News