శ్రీశైలం పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ – అడవి మార్గంలో భక్తులకు కీలక ఆదేశాలు
శ్రీశైలం పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ – అడవి మార్గంలో భక్తులకు కీలక ఆదేశాలు
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తులకు అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు అడవి మార్గం గుండా పాదయాత్రకు అనుమతి మంజూరు చేస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. లక్షలాది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో క్రమశిక్షణ, భద్రత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
పాదయాత్ర ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం వద్ద ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు చెక్పోస్ట్ వద్ద నిలిపి అక్కడి నుంచి కాలినడకన బయలుదేరాల్సి ఉంటుంది. అడవి మార్గంలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధమని, సిగరెట్లు, పాన్, గుట్కా, తంబాకు ఉత్పత్తులు, మద్యపానం వంటి వాటికి కఠిన ఆంక్షలు అమలు చేస్తామని అటవీ అధికారులు హెచ్చరించారు.
అడవి మార్గంలో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉండదని, డిజిటల్ లావాదేవీలు పనిచేయవని స్పష్టం చేశారు. అందువల్ల భక్తులు అవసరమైనంత నగదును చిల్లర రూపంలో వెంట తీసుకెళ్లాలని సూచించారు. దీర్ఘకాల నడక నేపథ్యంలో శరీర నొప్పులు, కీళ్ల సమస్యలు, అలసటకు అవసరమైన మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
మార్గమధ్యంలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, తాగునీటి అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తగినన్ని నీటి బాటిళ్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. నిర్దేశిత ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.ఈ పాదయాత్రలో కొండలు, లోయలు వంటి కఠిన భూభాగాల గుండా ప్రయాణం సాగుతుందని, శారీరకంగా పూర్తిగా సిద్ధంగా ఉన్న భక్తులే ఈ యాత్రకు బయలుదేరాలని స్పష్టం చేశారు. మార్గమధ్యంలో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయగా, పెద్ద చెరువు వద్ద రాత్రి విశ్రాంతికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.భక్తులు శ్రీశైలం వరకు నడిచి వెళ్లేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని, క్రమశిక్షణతో పాదయాత్రను పూర్తి చేస్తే ఆ పరమేశ్వరుడి కృపతో యాత్ర విజయవంతమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి