సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనం
సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనం
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి
భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహనీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతిని DSF విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విశ్వ నారాయణ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున, DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు హాజరై మాట్లాడారు. సావిత్రిబాయి పూలే మహిళలతో పాటు అణగారిన వర్గాల విద్య, హక్కుల కోసం జీవితాంతం పోరాడిన స్ఫూర్తిదాయక వ్యక్తిత్వమని పేర్కొన్నారు.
1831 జనవరి 3న మహారాష్ట్రలోని నైగావ్ గ్రామంలో జన్మించిన సావిత్రిబాయి, వివాహ సమయంలో నిరక్షరాస్యురాలైనా భర్త జ్యోతిరావ్ ఫూలే ప్రోత్సాహంతో చదువుకొని భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగారని గుర్తుచేశారు. 1848లో పూణేలోని భిడే వాడలో బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను ప్రారంభించి, రాళ్లు–బురదతో దాడులు ఎదురైనా వెనకడుగు వేయలేదని తెలిపారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం తమ ఇంటి బావిని తెరిచి, సామాజిక సమానత్వానికి బాటలు వేసిన విప్లవాత్మక నాయకురాలిగా ఆమె నిలిచారని అన్నారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం, శిశుహత్య వంటి దురాచారాలపై పోరాడడమే కాకుండా వితంతు పునర్వివాహాలకు మద్దతు ఇచ్చిన ధైర్యశాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
సత్యశోధక్ సమాజ్, మహిళా సేవా మండల్ వంటి సంస్థల ద్వారా మహిళల హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు తరతరాలకు ఆదర్శమని వక్తలు తెలిపారు. మహిళా విద్యే సామాజిక మార్పుకు మూలమని సావిత్రిబాయి పూలే చూపిన మార్గాన్ని విద్యార్థులు, యువత అనుసరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో DSF నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి