రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'
రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'
Editor Desk
రేపటి నుంచి యాప్ ద్వారానే కొనుగోలు.రమణా రెడ్డి
యాదాద్రి భువనగిరి:
జిల్లాలో యూరియా పంపిణీ విధానంలో కీలక మార్పు చేపట్టారు. రైతులకు మరింత పారదర్శకంగా, సక్రమంగా యూరియా అందించేందుకు కొత్త మొబైల్ బుకింగ్ విధానాన్ని రేపటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇకపై యూరియా కొనుగోలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారానే జరగనుంది. ప్రత్యక్షంగా యూరియా పంపిణీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
రైతులు తమ మొబైల్ నంబర్ ద్వారా యాప్లో నమోదు చేసుకుని సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. జిల్లాలోని ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఎవరైనా పరిశీలించే అవకాశం ఉంటుంది. పట్టా భూ యజమానులు, అటవీ హక్కుల పట్టాదారులు, నాన్ పట్టా రైతులు, కౌలుదారులు మాత్రమే యూరియా బుకింగ్కు అర్హులు.బుకింగ్ సమయంలో రైతుల గుర్తింపును నిర్ధారించేందుకు పట్టా పాస్ పుస్తకంతో అనుసంధానమైన మొబైల్ నంబర్కు ఒకసారి మాత్రమే ఉపయోగించే సంకేత సంఖ్య పంపిస్తారు. విక్రయ కేంద్రాలు నమోదు చేసే తాజా నిల్వల ఆధారంగా రైతులు అవసరమైన యూరియా సంచులను బుక్ చేసుకోవచ్చు.బుకింగ్ విజయవంతమైన వెంటనే ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేస్తారు. రైతు భూమిలో నమోదు చేసిన సాగు విస్తీర్ణంఆధారంగా యూరియా సంచుల సంఖ్య స్వయంచాలకంగా నిర్ణయించబడుతుంది. పంపిణీ సక్రమంగా జరిగేందుకు బుకింగ్లను విడతల వారీగా అమలు చేస్తారు.రైతులు జిల్లాలోని ఏదైనా ఎరువుల విక్రయ కేంద్రం లేదా సహకార సంఘం ద్వారా బుక్ చేసుకున్న యూరియాను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమైతే మొత్తం బుకింగ్ పరిమాణాన్ని వేర్వేరు విక్రయ కేంద్రాల నుంచి పొందవచ్చు.సాగు వివరాల ట్యాబ్లో ఒకసారి భూమి విస్తీర్ణం నమోదు చేసిన తర్వాత మార్పు చేసే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. యూరియా బుకింగ్ ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ సమయంలో యూరియాను కొనుగోలు చేయకపోతే బుకింగ్ స్వయంచాలకంగా రద్దై నిల్వ తిరిగి వ్యవస్థలోకి వెళ్లిపోతుంది.
రేపటి నుంచి యూరియా కొనుగోలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారానే జరగనుందని, రైతులంతా ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి