రామన్నపేటలో కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం
రామన్నపేటలో కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం
స్థానికం బృందం
గ్రామపంచాయతీ వద్ద స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమంలో భాగంగా శని వారం రామన్నపేటలో అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోపాల్ ఆరోగ్య విస్తరణాధికారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద, అలాగే రామన్నపేట బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రో అనే సూక్ష్మజీవి వల్ల కలిగే అంటువ్యాధి అని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని, రాగి రంగులో కనిపించే, వెంట్రుకలు లేని, మెరుస్తూ కనిపించే మచ్చలు కుష్ఠు వ్యాధి లక్షణాలు కావచ్చని వివరించారు. అటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలని, ఆశా కార్యకర్తల సహాయంతో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కుష్ఠు వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, సమయానికి చికిత్స తీసుకుంటే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని తెలిపారు. వ్యాధి రకాన్ని బట్టి ఆరు నెలలు లేదా పన్నెండు నెలలు పూర్తిస్థాయిలో మందులు వాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2027 నాటికి కుష్ఠు రహిత భారతదేశాన్ని సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులతో కుష్ఠు వ్యాధి నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామ సర్పంచ్ గరికపాటి సత్యనారాయణ, ఉప సర్పంచ్ మొటే రమేష్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి