రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?
రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?
స్థానికం బృందం
కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత నరేష్ డిమాండ్
రామన్నపేట: జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వేళ, రామన్నపేట మండలంలో కల్తీ యూరియా వ్యవహారం బయటపడటం కలకలం రేపుతోంది. బీఎస్పీ మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ ఆరోపణలతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆన్లైన్లో బుక్ చేసుకుని రామన్నపేటలోని ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన యూరియా నకిలీగా ఉన్నట్లు కొమ్మాయిగూడానికి చెందిన రైతులు నరసింహ, గణేష్ ఫిర్యాదు చేశారు. ఇటీవల 6 బస్తాలు కొనుగోలు చేసి అందులో 3 బస్తాలు తెరిచి చూడగా, యూరియా బదులుగా నల్లటి మట్టి పెళ్లలు కనిపించాయని వారు ఆరోపించారు.
ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని నరేష్ పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న బస్తాల్లో ఇలా కల్తీ పదార్థం ఉండటం ఆందోళనకరమని అన్నారు. అదేవిధంగా బస్తాల బరువు కూడా తక్కువగా ఉన్నట్లు రైతులు వాపోయారని తెలిపారు.
జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ షాపులను తనిఖీ చేసి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని నరేష్ డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి