రైతును ఇబ్బంది పెడితే మిలర్ల పై కఠిన చర్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
రైతును ఇబ్బంది పెడితే మిలర్ల పై కఠిన చర్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
NM Yadav
ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లకు మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక..
రాత్రి వేళల్లోనూ కొనుగోళ్లు జరపాలి అధికారులకు ఆదేశం..
జిల్లాలో జోరుగా సాగుతున్న రబీ ధాన్యం సేకరణ..
నల్గొండ : రబీ ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతను కొనుగోలుదారులు లేదా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నల్గొండ జిల్లాలోని నల్గొండ, కనగల్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కనగల్ మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం తనిఖీ సందర్భంగా లారీల కొరత ఉన్నట్లు నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ కాంట్రాక్టరుతో మాట్లాడి కనగల్ కు ఆరు, జి.ఎడవల్లికి ఎనిమిది లారీలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లో నిలిచిపోకూడదని అవసరమైతే రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి మరీ సేకరణ పూర్తి చేయాలని సూచించారు. వేసవి కాలం కావడంతో తేమ శాతం, తాలు, తరుగు వంటి సమస్యలు ఉండవని హమాలీల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను కలెక్టర్, అదనపు కలెక్టర్ నేతృత్వంలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని రైతులు ఎక్కడా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు దొడ్డు ధాన్యం ధరను కూడా పెంచామని గుర్తు చేశారు. ఐకేపీ మహిళా సంఘాల కోసం 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మిస్తామని ప్రకటించారు.
జిల్లాలో వ్యవసాయాభివృద్ధిపై స్పందిస్తూ ఏఎమ్మార్పీ కాల్వల లైనింగ్ కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీరు రాగానే కనగల్ చెరువును నింపుతామని మంత్రి హామీ ఇచ్చారు. మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, వారం రోజుల పాటు పగలు, రాత్రి కష్టపడి కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మరియు ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి